జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తన భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని వెనక్కు పంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మొత్తం నలుగురు గన్మెన్లకు ఈ విషయాన్ని తెలియజేసిన పవన్ కళ్యాణ్ సిబ్బంది ... ప్రభుత్వానికి సరెండర్ కావాలంటూ సూచించారు. గత నెలలో గుంటూరులో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తనపై దాడి జరిగే అవకాశముందంటూ పవన్ వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2+2 గన్మెన్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
గన్మెన్లను ఏర్పాటు చేసిన నెల తరువాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెక్యూరిటీ వద్దంటూ గన్మెన్లను వెనక్కి పంపడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకే ప్రభుత్వంలోని పెద్దలు తనకు సెక్యూరిటీ కల్పించినట్టు పవన్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఇటీవల కాలంలో పలువురు నేతలతో నిర్వహించిన సమావేశాల వివరాలు లీక్ అవడం సెక్యూరిటీ సిబ్బంది పనేనని అనుమానిస్తున్నారు. పార్టీలోని అంతర్గత విషయాలు వెలుగుచూడటం కూడా ఇందులో భాగమనుకున్న తరువాతే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పవన్ అనుమానిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జనసేనపై నిఘా పెట్టిందా? జనసేనలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ ను ఎవరెవరు కలుస్తున్నారో ఆ వివరాలు గన్ మెన్ల ద్వారా టీడీపీకి చేరుతున్నాయా?