తలకు ఎర్రటోపీలు, చేతిలో ఎర్ర బ్యానర్లు పట్టుకుని రైతులు నిశ్శబ్ద విప్లవంలా.. పదులు, వందలు కాదు 20వేల మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడానికి అకుంఠిత దీక్షతో పాదయాత్రగా సాగి ముంబై నగరానికి చేరుకున్నారు. గురువారం ముంబయిలోని ఆజాద్ మైదానానికి చేరుకోవడంతో వీరి ర్యాలీ ముగియనుంది. అనంతరం రైతులు అక్కడే కూర్చోని తమ డిమాండ్ల నెరవేరే వరకు ఆజాద్ మైదానంలోనే కూర్చుంటామని ముక్తకంఠంతో హెచ్చరించారు. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని నీటి పరిరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తదితరులు వెన్నుండి నడిపిస్తున్నారు. కాగా ఈ ఆందోళనల నేపథ్యంలో ముంబయిలో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రైతులకు ధర్నా చేయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని మోర్చా జనరల్ సెక్రటరీ పత్రిభా షిండే ఆవేదన వ్యక్తం చేశారు.