కొలిక్కివచ్చిన చెన్నూరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ వివాదం

Update: 2018-09-14 04:35 GMT

టీఆర్‌ఎస్‌లో వారంరోజులుగా రగులుతున్న చెన్నూరు టికెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కేసీఆర్ బుజ్జగింపులతో ఓదేలు మెత్తబడ్డారు. తన జీవితాంతం కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తానన్న ఓదేలు చెన్నూరులో బాల్క సుమన్‌ గెలుపు కోసం కృషిచేస్తామంటూ ప్రకటించారు.

టీఆర్ఎస్‌లో చెన్నూరు టికెట్‌ లొల్లి ముగిసింది. హ్యాట్రిక్‌ విజయం సాధించిన తనను కాదని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు టికెట్‌ ఇవ్వడంతో రగిలిపోతున్న నల్లాల ఓదేలు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ తర్వాత మెత్తబడ్డారు. బాల్క సుమన్‌ పర్యటనలో ఓదేలు అనుచరుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, తీవ్ర సంచలనమవడంతో గులాబీ బాస్‌‌ ఓదేలును పిలిచి మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తానని ఓదేలుకు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దాంతో మెత్తబడ్డ ఓదేలు కేసీఆర్‌ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు.

తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఓదేలును ప్రగతి భవన్‌‌కు పిలిపించుకుని కేసీఆర్‌ బుజ్జగించడంతో చెన్నూరు టికెట్‌ వివాదానికి ఎండ్ కార్డ్‌ పడింది. చెన్నూరులో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేస్తానన్న ఓదేలు కార్యకర్తలు తొందరపడకుండా పార్టీ వెంటే నడవాలంటూ పిలుపునిచ్చారు.

Similar News