చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయించండి

Update: 2018-02-15 06:39 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రం మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఓటుకు నోటు కేసుకు భయపడకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఉన్న టిడిపి మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసం నుంచి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను ఆయన బుధవారం విడుదల చేశారు.

హోదా కోసం ప్రత్యక్షంగా రోడ్డుపైకి వస్తే ఉద్యమానికి సహకారం అందిస్తామన్నారు. ప్రత్యేకహోదా లేదా ప్యాకేజీ సాధన కోసం తెరవెనుక రాజకీయాలు చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ను బలిచేయడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. 'తిరుపతిలో మోడీ బహిరంగ సభలో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, 10 ఏళ్లుకావాలన్నారు. ఆ తరువాత ప్రత్యేకహోదా సంజీవని కాదని, హోదా కన్నా ప్యాకేజీ ముద్దు అన్నారు. ఓటుకు నోటు కేసులో మోడీ కాపాడారని, మోడీ దైవంతో సమానమని అన్నారు' అంటూ ముద్రగడ గుర్తు చేశారు. ప్రస్తుతం హామీలు అమలుచేయని ప్రధాని అంటూ ప్రజలను మోసగించడం ఎంతవరకూ సమంజసమన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలు లాంటివి చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఇచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ప్రశ్నించే పురంధేశ్వరి, సోము వీర్రాజుతోపాటు తన వంటి వారిని దొంగలు, జగన్‌కు అమ్ముడుపోయారంటూ ఎదురుదాడి చేయించడం అలవాటుగా మారిపోయిందన్నారు.

Similar News