కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కుమార్తె, సినిమా దర్శకుడి ప్రేమ వివాహం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న మాయకొండ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి, 'కన్నడ మాస్తిగుడి' దర్శకుడు పీ సుందర్ గౌడలు గురువారం నాడు చాముండి కొండపై వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సుందర్ బంధువులు పలువురు హాజరయ్యారు. ఎమ్మెల్యే శివమూర్తి తన కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మైసూరులో వరుడి బంధువులు బసచేసిన హోటల్ వద్దకు వచ్చి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వధూవరులు, సీక్రెట్ గా బెంగళూరుకు పారిపోయారు.
వధూవరులు లక్ష్మి– సుందర్లు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెళ్లికూతురు మాట్లాడుతూ.. తాను– సుందర్గౌడ ఇద్దరం ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నామని తెలిపారు. ఈ పెళ్ళి తన ఇష్ట ప్రకారమే జరిగిందని, ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మా వల్ల ఎవరికి ఇబ్బంది కలిగించ వద్దని వేడుకున్నారు. వీరిద్దరి మధ్య సుమారు ఆరునెలల నుంచి ప్రేమాయణం సాగుతోందని తెలుస్తోంది.