మిజోరంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ హైపీ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. హైపీ తన రాజీనామా పత్రాన్ని సోమవారం డిప్యూటీ స్పీకర్ ఆర్ లాల్రినామాకు సమర్పించాగా, డిప్యూటీ స్పీకర్ రాజీనామా ప్రతాన్ని ఆమోదించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ఈ సందర్భంగా హైపీ స్పష్టంచేశారు. త్వరలోనే హైపీ బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైపీ పార్టీని వీడటంతో కాంగ్రెస్కు షాక్ తగిలినట్లయింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరం. అక్కడ నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా హైపీ భాజపాలో చేరుతారని గత కొంతకాలంగా ఊహాగానాలకు నేడు తెరపడింది. ఇటీవలే ఆయన కేంద్రంలోని బీజేపీ నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తాను స్పీకర్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హైపీ నేడు ప్రకటించారు.