మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ కు కనిపించడంలేదా.. అని ప్రశ్నించారు. రాహుల్ ఓ తెల్లకాగితమని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే తెలుసన్నారు. తనది పొగరు కాదని.. పౌరుషమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ జట్టుకట్టిందని విమర్శించారు. మహాకూటమికి ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. పేదల సంతోషాన్ని కూడా కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని చెప్పారు.