ఏటీఎంల నుంచి జనాలకు డబ్బు రాకపోయినా ఎలుకలకు మాత్రం మేత బాగా దొరుకుతోంది. ఎటీఎంలలో ఉంచిన నగదును ఎలుకలు చిత్తు కాగితాలుగా కొరికి వేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. టిన్సుకియా లైపులిలోని ఓ ఏటీఎంలో 12 లక్షల రూపాయలను ఎలుక తినేసింది. గత నెల 20 నుంచి అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ఈ ఏటీఎమ్ను బ్యాంకు సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఏటీఎంలోకి చొరబడిన ఎలుక అందులో ఉన్న నోట్లను తినేసింది. నాలుగు రోజుల క్రితం ఏటీఎం రిపేరు చేసేందుకు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని ఖంగుతున్నారు. ఎలుకలు తిన్న వాటిలో 500, రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఏటీఎంలలో పటిష్టమైన బాక్సులలో ఉంచిన నగదును ఎలుకలు తినడంపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిదంటూ విమర్శిస్తున్నారు. నష్టాలు చూపడం జనంపై ఎడపెడా చార్జీలు బాదడం అలవాటైన బ్యాంకు యాజమాన్యాలకు ఇలాంటి ఘటనలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు.