కౌంటింగ్కి ముందే తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనుండగా, అప్పుడే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. కౌంటింగ్కి ముందే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరలేపిందంటూ టీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది. ఓడిపోతామని ముందే పసిగట్టిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపించారు. లగడపాటి సర్వేతో గందరగోళానికి గురిచేసి ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి తనకు ఫోన్ చేశారంటూ నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి తనకు రెండుసార్లు ఫోన్ చేశారన్న మర్రి కాంగ్రెస్కు సీట్లు తక్కువ పడితే మద్దతు ఇవ్వాలని కోరారన్నారు. జానారెడ్డి ఇంట్లో మాట్లాడుకుందామంటూ తనను రమ్మని పిలిచారని మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు.
చంద్రబాబు డైరెక్షన్లో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారన్న మర్రి జనార్దన్రెడ్డి ఓటుకు నోటు తరహాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ తరపున గెలవబోయే అభ్యర్ధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాయ నుంచి బయటికి రండంటూ విశ్వేశ్వర్రెడ్డికి చెప్పి ఫోన్ పెట్టేసినట్లు మర్రి వెల్లడించారు. అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదన్న మర్రి తాను కేసీఆర్ సైనికుడినన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్న మర్రి టీఆర్ఎస్ 80 నుంచి 85 సీట్లు గెలవబోతోందన్నారు.