విశాఖ మన్యంలో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఏవోబీలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బలిమెలా రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తప్పవని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టులు హెచ్చరించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కొద్ది రోజుల క్రితం కాల్చి చంపి మావోయిస్టులు కలకలం సృష్టించారు. నిన్న ఆంద్రా-ఒడిశా సరిహద్దులలో బహిరంగసభను నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు.
బలిమెల జలాశయం పై నిర్మించిన గురుప్రియ వంతెన వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. బలిమెలా రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆతర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆదివాసీ ప్రజలు వినాశనం కోసమే గురుప్రియ వంతెన నిర్మించారని, ఈ వంతెన వద్ద పోలీసుబలగాలు ఏర్పాటుచేసి వచ్చేపోయే గిరిజనులను ఇబ్బందులు పెడుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ బహిరంగసభకు కటాఫ్ ఏరియాలోని ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు హాజరయ్యారు.