ఏపీలో ఆపరేషన్ ద్రవిడ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. సినీనటుడు శివాజీ వెల్లడించిన ఆపరేషన్ అంశాలపై సమ్రగ విచారణ జరపాలంటూ మాజీ మంత్రి మాణిక్యాల రావు ఏపీ డీజీపీకి లేఖరాశారు. ద్రవిడ ఆపరేషన్ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొందరు కుట్రలకు పాల్పడుతారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై పూర్తి స్ధాయి విచారణ జరపాలన్నారు.
సినీ నటుడు శివాజీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టబోతోందని శివాజీ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ ద్రవిడ’లో ఇదొక భాగమన్నారు. ఏపీ, తెలంగాణకు చెంది ‘ఆపరేషన్ గరుడ’.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ రావణ’.. కర్ణాటకలో ‘ఆపరేషన్ కుమార’ను ఆ పార్టీ చేపట్టబోతోందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్కు అనుసంధానకర్తగా ఓ రాజ్యాంగ శక్తి వ్యవహరిస్తోందన్నారు. ఫలితంగా ఆయన పదవీ కాలం పొడగించబోతున్నారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం రూ.4,800 కోట్లు కేటాయించారని, ఇందులో సగం ఇప్పటికే పంపిణీ జరిగిందంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.