తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు (జులై 20)న లోక్సభలో చర్చ జరగనుంది. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అన్ని పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్నారు. ఇందుకోసం ప్రశ్నోత్తరాల సమయం కూడా రద్దు చేశారు. వివిధ పార్టీల సభ్యులు మాట్లాడేందుకు టైమ్ కేటాయించారు స్పీకర్. అవిశ్వాసం తీర్మానంపై మాట్లాడేందుకు బీజేపికి అత్యధికంగా 3 గంటల 33 నిమిషాలు సమయాన్ని కేటాయించారు. కాంగ్రెస్కు 38 నిమిషాలు, అన్నాడీఎంకే 29, తృణమూల్ కాంగ్రెస్ 27, బీజేడీకి 15 నిమిషాలు, శివసేన 14 , టీడీపీకి 13 నిమిషాలు, టిఆర్ఎస్ 9, సీపీఎం 7, సమాజ్వాదీ పార్టీ 6, ఎన్సీపీ 6, ఎల్జెఎస్పీకి 5 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. ఇక తీర్మానం ప్రవేశ పెట్టిన టీడీపీకి 13 నిమిషాలే టైమ్ ఉండటంతో ఆ పార్టీ తరుపున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లడనున్నారు. సమయానికనుగుణంగా ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని మాట్లాడే అవకాశం ఉంది. కాగా అవిశ్వాసం ఎదుర్కోవడానికి బీజేపీ ఇప్పటికే సిద్ధమైంది. మొదటినుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజి కావాలని.. చివరకు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రత్యేక హోదా కావాలంటున్నారని టీడీపీపై ఎంపీ జివిఎల్ నరసింహారావు మండిపడుతున్నారు.