దాణా స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ముడున్నరేళ్లు జైలుశిక్ష ఖరారు చేసింది.. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. లాలూకు రూ.5లక్షలు జరిమానా విధించిన కోర్టు.. మొత్తం ఏడుగురు దోషులకు శిక్ష ఖరారు చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు జడ్డి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరికి శిక్షను ఖరారు చేసింది.
బిహార్లో రెండు దశాబ్దాల క్రితం వెలుగుచూసిన దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో నిందితులైన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు మరో 15 మందిని గత నెలలో దోషులుగా తేల్చింది. అలాగే, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా సహా మరో ఐదుగర్ని నిర్దోషులుగా ప్రకటించింది.
1991 నుంచి 1994 మధ్య జరిగిన ఈ కుంభకోణం 1997లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పశువుల దాణా పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో.. లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొందరిపై కేసు నమోదైంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తన భార్య రబ్రీ దేవిని సీఎంను చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి లాలూపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
లాలూపై నమోదైన కేసుల్లో ఒకటైన చైబాసా కోశాగార కేసులో.. ఇప్పటికే, లాలూ దోషిగా తేలారు. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతేగాక.. లాలూ ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఆ సమయంలో రెండున్నర నెలల పాటు జైల్లో ఉన్న లాలూ.. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు.
తాజాగా వచ్చిన తీర్పు దేవగఢ్ కోశాగార కేసుకు సంబంధించింది. 1991 నుంచి 1994 మధ్య ఈ ఖజానా నుంచి రూ.89లక్షలు పశుదాణా పేరుతో స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో 38 మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. విచారణ సమయంలో వీరిలో 11 మంది మృతిచెందగా, మరో ముగ్గురు అప్రూవర్గా మారారు. ఇంకో ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో 2006లో వారికి శిక్ష విధించారు.