త్వరలో జరిగే ఎన్నికల్లో వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు తాజా మాజీ ఎమ్మెల్యేకొండా సురేఖ ప్రకటించారు. ఆదివారం పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, పరకాలలో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పరకాలలో ఆమె మాట్లాడుతూ పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అయితే తాను పరకాలలో పోటీ చేయడంతో పాటు వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.