తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆ పార్టీ శాసభసభా పక్షనేతగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల సంఘం పూర్తి గెజిట్ విడుదలైన తర్వాతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా తెలంగాణలో ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం దేశ వ్యాప్తంగా అమలు చేస్తే ఎంత పెట్టుబడి అవుతుందో తనకు ఒక అంచనా ఉందని పేర్కొన్నారు. సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. రైతుబంధు పథకం తెలంగాణలో విజయవంతమైందని, ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పారు.