జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందంటూ పదేపదే చెబుతూ వస్తోన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకోసం కీలక అడుగు ముందుకేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు వీలుగా, రాష్ట్రంలో పార్టీ బాధ్యతలను తనయుడు కేటీఆర్కి అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తన తర్వాత కేటీఆరే అసలైన వారసుడు అనే స్పష్టమైన సంకేతాలను కేడర్కు పంపారు. రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో పనిభారం పెరగనుంది. అదే సమయంలో జాతీయ రాజకీయాలపైనా అధిక దృష్టి పెట్టనుండటంతోనే పార్టీని తాను అనుకున్నవిధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు కేసీఆర్. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కేడర్ను సిద్ధంచేయడం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు.