తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి ప్రారంభమైంది. తమ ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసేందుకు దారి పొడువున డీఎంకే కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. తమ అభిమాన నేతకు నాయకులు, అభిమానులు, ప్రజలు కన్నీటితో నివాళులర్పిస్తున్నారు. మెరీనా బీచ్ రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర సాగుతోంది. మరికాసేపట్లో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో జరగనున్నాయి. హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్లో నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు రాజాజీహాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగనుంది. అనంతరం మెరీనా బీచ్లో ప్రభుత్వలాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో డీఎంకే నేతలు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.