హిజ్రాలు శుభసూచకమంటారు. ఏదైనా పనిని హిజ్రాలతో ప్రారంభిస్తే మంచి జరుగుతుందంటారు. సాక్షాత్తు భగవంతుడు, దైవ స్వరూపుడు శివుడే
అర్ధనారీశ్వరుడనే భావన చాలా మందిలో ఉంది. శివ-పార్వతుల మిళితంగా హిజ్రాలను కొందరు భావిస్తుంటారు. ఇంతటి నేపథ్యమున్న హిజ్రాలు ఆశీర్వదిస్తే
అన్ని శుభాలే జరుగుతాయనేది చాలా మందిలో నెలకొంది. ఇప్పుడు హిజ్రాలకు ఒక్కసారిగా భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకీ ఈమతలబేమిటని ఆలోచిస్తున్నారా... అదేనండీ కర్నాటక ఎన్నికలే హిజ్రాల కొరతకు కారణంగా మారడం విశేషం.
కర్నాటక ఎన్నికల్లో హిజ్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. హిజ్రాల కోసం అక్కడి అభ్యర్థులు వేట మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి హిజ్రాలను ప్రచారం కోసం తీసుకెళ్లుతున్నారు. హిజ్రాలు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే చాలు విజయం
సిద్ధించినట్లేననే భావనలో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరికోసం పెద్ద మొత్తం డబ్బులు వెచ్చిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా
వెనకాడడం లేదు. ఇప్పటి వరకు కర్నాటకలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిజ్రాల ప్రచార జోరు కొనసాగుతుండడం విశేషం. హిజ్రాల ప్రచార
సెంటిమెంట్తో వారు చేస్తున్న ఆర్భాటాలు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
కొద్దిరోజుల్లోనే కర్నాటక ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులు భావిస్తున్న వేళ
ఈ హిజ్రాల సెంటిమెంట్ ఏమేరకు ఫలిస్తోందో చూడాలి.