తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతికి సంబంధించిన కేసు విచారణ వేగవంతమైంది. జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డికి కమిషన్ సమన్లు ఇచ్చింది. 15 రోజుల్లోగా నేరుగా విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. జయలలిత మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, ఆసుపత్రిలో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న జయలలిత వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే.