భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య చేయకూడని పని చేసింది. సంసారానికి పనికిరాకుండా చేసి అత్యంత దారుణమైన శిక్ష విధించింది. అతని జననాంగాన్ని కోసేసి టాయ్లెట్ కమోడ్లో పడేసింది. బాధితుడి తండ్రి వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించాడు. రక్తం చాలా ఎక్కువగా పోవడంతో అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పంజాబ్లోని జలంధర్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జోగీందర్ నగర్లో నివసించే ఆజాద్ సింగ్, అతని భార్య సుఖ్వంత్ కౌర్లు తరచూ గొడవపడేవారు. అతను వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య అనుమానం. ఎన్నిసార్లు చెప్పినా అతనిలో మార్పురాకపోవడంతో కౌర్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోదింది. ఆ దెబ్బకే అతను స్పృహకోల్పోయాడు. తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్ బేసిన్లో పారేసి నీళ్లు పోసింది. కొడుకు పరిస్థితిని గుర్తించిన ఆజాద్ తండ్రి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆజాద్ పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుమేరకు పోలీసులు సుఖ్వంత్ కౌర్ను అరెస్టు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.