కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు ఈ తెల్లవారుజామున రెండున్నర గంటలకు వరకు కొనసాగాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల ఐటీ దాడుల్లో లెక్కలు చూపని 20 కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదిగా ఐటీ అధికారులు తేల్చారు. ఒకరి పేరు మీద భూములు కొనుగోలు చేయడం కొంతకాలం తర్వాత మరొకరికి బదలాయించడం ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకోవడం ఇలా రేవంత్ రెడ్డి అనేక అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖ అనుమానిస్తోంది.
మొత్తం 43 గంటల పాటు సాగిన సోదాల్లో రేవంత్ రెడ్డి, ఆయన భార్యను కలిపి దాదాపు 31 గంటలపాటు ఐటీ అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. అక్టోబర్ మూడున బషీర్ బాగ్ ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
సోదాలు ముగిసిన అనంతరం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై రేవంత్, ఆయన భార్య గీతతో సంతకాలు తీసుకున్నారని, మొత్తం మూడు సూట్కేసుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారనీ సమాచారం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇంటిపై ఐటీ అధికారుల దాడులు జరిగాయనీ ఆరోపిస్తున్న రేవంత్రెడ్డి ఈ ఉదయం 11గంటలకు మీడియా ముందుకు రానున్నారు.