కేరళలో వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలకు వివిధ రాష్ట్రాలనుంచి ఆపన్నహస్తం అందుతోంది. కేరళకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 25కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10కోట్ల విరాళం ప్రకటించింది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం తరుపున 10కోట్ల సహాయం ప్రకటించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ 10కోట్లు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 10కోట్ల సాయం అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక నెల జీతాన్ని కేరళ సహాయ నిధికి ఇవ్వనున్నారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేరళ బాధితుల కోసం కోటి విరాళంగా ప్రకటించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల సాయం ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 10కోట్ల ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 5 కోట్ల సాయం ప్రకటించారు. అలాగే సహాయక చర్యలు అందించేందుకు 245 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందం 75బోట్లను కూడా తీసుకెళ్తోంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ 20 కోట్ల సాయం ప్రకటించారు.