మహబూబ్నగర్ జిల్లా పచ్చబడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాలలో గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో హరీశ్ రావు మాట్లాడుతూ..ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాస పాలమూరు ప్రాంత ప్రజలకు నీళ్లందించేందుకు నాడు పాదయాత్ర.. నేడు గట్టు యాత్ర చేస్తుంటే ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు మాత్రం పదవుల కోసం దిల్లీ యాత్రలు చేస్తుంటారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు దిల్లీ యాత్రలు గుర్తుకొస్తాయి తప్ప ప్రజల కష్టాలు గుర్తుకు రావని విమర్శించారు. రూ.554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని, దీని ద్వారా 33వేల ఎకరాలకు నీరందించడమే తమ లక్ష్యమన్నారు.
రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని, చిట్టచివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని సీఎం తమకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. నాడు ఉద్యమ సమయంలోనైనా.. నేడైనా మహబూబ్నగర్ జిల్లా పచ్చపడాలన్నదే సీఎం ఆలోచన, కల అని అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక మొత్తం నాలుగేళ్లలో 12లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చామని అన్నారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే 6.50 లక్షల ఎకరాలకు నీళ్లందించినట్టు చెప్పారు. పాలమూరు పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అలాంటిదన్నారు. చంద్రబాబు, వైఎస్ జిల్లా ప్రజలను మోసం చేశారు. జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని అన్నారు. ఎస్సారెస్పీతో యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు నీళ్లిస్తామని..కృష్ణానీటితో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తమని హరీశ్రావు వెల్లడించారు.