రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ప్రజా గాయకుడు గద్దర్....కాంగ్రెస్లో చేరే అంశంపై వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.. ఢిల్లీలో బుర్జువా పాలన కొనసాగుతోందనీ.. దాని అంతానికే రాహుల్ ను కలిశానని చెప్పారు. సెక్యులర్ పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటానన్న గద్దర్..మిగిలిన లౌకిక పార్టీల నేతలను కూడా కలుస్తానని తెలిపారు. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే గజ్వేల్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు గద్దర్. గద్దర్ ఢిల్లీ బాట పట్టిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే రాహుల్తో భేటీ తర్వాత గద్దర్ తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు గద్దర్ వివరించారు. తెలంగాణ ఇచ్చిన ప్రయోజనాలు నెరవేరలేదని సోనియాకు వివరించినట్లు తెలిపారు. అయితే మహాకూటమికి అనుకూలంగా ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను గద్దర్కు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే తన కుమారుడు సూర్యకిరణ్కు బెల్లంపల్లి సీటు గురించి కేటాయించడంతో పాటు మరో ఇద్దరు అనుచరులకు కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దర్ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.