వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిధర్రెడ్డి వైఎస్సార్పీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో బుధవారం జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కందుకూరు నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్ రెడ్డిని జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్షంగా పనిచేస్తానని చెప్పారు. కాగా కందుకూరు నియోజకవర్గం నుంచి మహీధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున కందుకూరు నుంచి పోతుల రామారావు గెలుపొందారు. కానీ అయన టీడీపీలో చేరిపోవడంతో వైసీపీ నేతలు మహీధర్ రెడ్డిని రంగంలోకి తీసుకువచ్చారు.