మేఘాలయలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు గడువు ఉన్న సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి రోవెల్ లింగోడ్ కూడా ఉన్నారు. మొత్తం 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 30 మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో ‘కాంగ్రెస్’ బలం 24కు పడిపోయింది. కాగా, ఇద్దరు ఇండిపెండెంట్ లు, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మరో రెండు నెలల్లో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రోవెల్ మాట్లాడుతూ.. తామంతా త్వరలో నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఆ పార్టీ ర్యాలీ సందర్భంగా చేరతామని స్పష్టం చేశారు.