రైల్వే జోన్ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రిని సైతం నిలదీశారు. దీంతో ఈ సమావేశం హాట్ హాట్ గా ముగిసింది.
రైల్వే జోన్ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన టీడీపీ నేతలు ఆయనను గట్టిగా ప్రశ్నించారు. నాలుగేళ్లయినా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రైల్వేజోన్ ఎప్పుడిస్తారో కచ్చితమైన గడువు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తుండగా బీజేపీ ఎంపీ జీవిఎల్ జోక్యం చేసుకోవడానికి యత్నించారు. దీంతో అసలు జీవీఎల్ ఎవరంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కళా వెంకట్రావ్ జీవీఎల్తో వాగ్వాదానికి దిగారు.
చివరికి జీవీఎల్తో గొడవ పడుతున్న టీడీపీ నేతలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సర్ది చెప్పారు. టాస్క్ఫోర్స్ కమిటీ నివేదిక తర్వాత రైల్వేజోన్పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది.