ప్రేమించిన ప్రియుడి కోసం డాక్టర్ అవతరమెత్తిన ప్రియురాలి గుట్టురట్టయింది. గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నానంటూ నమ్మించబోయి అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డికి చెందిన రిజ్వానాబేగం(32) భర్తతో విడాకులు తీసుకొని బోయిన్పల్లిలో ఉంటోంది. స్థానికుడైన అబ్దుల్ కరీంతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాను వైద్యురాలినని గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నానంటూ నమ్మించింది. కరీం బంధువు ఒకామె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయంలో సహాయం చేయాలని కరీం ప్రియురాలిని కోరాడు. ప్రియుణ్ని నమ్మించేందుకు రిజ్వానా ఓ ఆప్రాన్, స్టెతస్కోప్ కొనుగోలు చేసింది. వాటిని చేతి సంచిలో పెట్టుకొని రెండు రోజులుగా ఆసుపత్రి లోనికి వెళుతూ వస్తోంది. కాపలా సిబ్బంది నిలువరిస్తే ఆప్రాన్, స్టెతస్కోప్లను చూపిస్తోంది. తన పాచిక పారడంతో గురువారం కరీంతోపాటు అతని మిత్రుడు మెయినుద్దీన్లను తీసుకుని ఆసుపత్రిలోకి వెళ్లింది. తాను పనిచేసేది ఇక్కడేనంటూ పీఐసీయూ వార్డు వైపు వెళ్లసాగింది. అక్కడ ఉన్న ఆసుపత్రి భద్రతాధికారి ప్రదీప్, సూపర్వైజర్ జంగయ్య వారిని నిలువరించగా తాను డాక్టర్నంటూ బ్యాగులోంచి వస్తువులు తీసి చూపించింది. గుర్తింపు కార్డు అడగ్గా, మర్చిపోయానని చెప్పింది. పీఐసీయూ వార్డుకు ఆమెను తీసుకెళ్లి విచారించగా ఆమె అక్కడ పని చేయడం లేదని చెప్పడంతో రిజ్వానాతోపాటు మరో ఇద్దరిని ఔట్పోస్టులోని పోలీసులకు అప్పగించారు. ఏజిల్ సెక్యూరిటీ సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్కుమార్ అభినందించారు