భారత్లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్ను అందుబాటులోకి తేవాలని ఫేస్బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్పై ఫేస్బుక్ కసరత్తు చేస్తోంది. ఇన్నాళ్లూ ఫేస్బుక్లో మనం యాడ్ చేసుకున్న వారి పోస్ట్లు నచ్చకపోతే వారిని అన్ఫ్రెండ్ కానీ, అన్ఫాలో కానీ చేసేవాళ్లం. దీంతో వారు ఆ తర్వాత ఏం పోస్ట్ చేసినా కనిపించేది కాదు.
అన్ఫ్రెండ్, అన్ఫాలో చేయడమంటే వారితో బంధాన్ని పోస్టుల మూలాన పూర్తిగా తెంచుకోవడం లాంటిది. ఆ తర్వాత వారు ఎటువంటి ఉపయోగకర పోస్టులు పెట్టినా మనం వాటిని కోల్పోతాం. కానీ ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ఫేస్బుక్ ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. స్నూజ్ అనే ఈ ఫీచర్ వల్ల పోస్ట్లను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. మన ఫ్రెండ్, మనం ఫాలో అయ్యే పేజ్, గ్రూప్స్లో పోస్ట్ చేసే ఎటువంటి సమాచారాన్నైనా 24 గంటల వరకూ గానీ, 7రోజులు లేదా 30 రోజుల వరకూ గానీ నిలిపివేయవచ్చు. ఆ కాల పరిమితి తర్వాత మళ్లీ ఎప్పటిలానే వారి పోస్ట్లు మనకు కనిపిస్తాయి. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.