పోలింగ్ ముగిశాక ఈవీఎంలను భద్రపరచడం అధికారులకు కత్తి మీద సాములాంటిది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం ఒక ఎత్తయితే ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి సురక్షితంగా తరలించడం మరో ఎత్తు. ఐతే రాజస్థాన్లోని ఎన్నికల అధికారులు మాత్రం ఈవీఎంల భద్రతను గాలికొదిలేయడం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్లో నిన్న ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను పోలింగ్ కేంద్రం నుంచి తరలిస్తుండగా రాజస్థాన్లోని కిషన్గంజ్ పరిధిలోని శంషాబాద్ వద్ద వాహనం పైనుంచి ఓ బ్యాలెట్ బాక్స్ యూనిట్ హైవే మీదకు జారి పడింది. ఈ విషయాన్ని గ్రహించకుండానే ఆ వాహనం చేరాల్సిన చోటుకి చేరింది.
ఇంతలో రోడ్డుపైన కొంతమంది ఈ ఈవీఎంను చూసి ముక్కున వేలేసుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా అక్కడికొచ్చి చూసి ఆ ఈవీఎం నిన్న ఎన్నికల్లో ఉపయోగించినదేనని తీరిగ్గా చెప్పారు. ఓటర్లు వినియోగించిన ఈవీఎంను అంత నిర్లక్ష్యంగా తరలిస్తుండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్ రఫీక్, నవల్ సింగ్ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.