బాబ్లీ కేసులో రీకాల్ పిటిషన్పై ధర్మాబాద్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. బాబ్లీ కేసులో చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. వచ్చే నెల 15న చంద్రబాబుతో సహా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు అందుకున్న వారంతా హాజరు కావాల్సిందేనని ధర్మాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. చంద్రబాబు తరుఫు లాయర్లు కొంత సమయం కోరగా ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేమన్న జడ్జి తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేశారు.
చంద్రబాబుతో సహా నోటీసులు అందుకున్న టీడీపీ నేతల తరుఫున ముగ్గురు న్యాయవాదులు ధర్మాబాద్ కోర్టుకి హాజరయ్యారు. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు రద్దు చేయాలని కోరుతూ రీకాల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. తమ క్లయింట్లు ఎవరికి ఇప్పటి వరకు నోటీసులు అందలేదని ఏపీ లాయర్లు వాదించారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసే కోర్టుకు హాజరయ్యామని తెలిపారు. కేసు వాయిదా కోరారు. అయితే అందుకు ధర్మాబాద్ కోర్టు న్యాయమూర్తి అంగీకరించలేదు. వచ్చే నెల 15న చంద్రబాబుతో సహా అందరూ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
మరోవైపు ధర్మాబాద్ కోర్టుకు హాజరైన తెలంగాణ నేతలు గంగుల కమలాకర్, ప్రకాశ్గౌడ్, కె.ఎస్ రత్నం నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు కోరుతూ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గంగుల కమలాకర్, ప్రకాశ్గౌడ్, కె.ఎస్ రత్నంకి ఐదు వేల జరిమానా విధించిన కోర్టు ఆ ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది.