ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఘోర అవమానం ఎదురైంది. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరం. మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ జిల్లా హర్దాస్పూర్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్దాస్పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్లో ఉన్న ఈ నవ దంపతులు.. ఇటీవలే అలీరాజ్పూర్లోని తన మామ నివాసానికి(యువకుడి మేనమామ) చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని దంపతులను జులై 25న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవదంపతులను తీవ్రంగా కొట్టి.. గుండు గీయించారు. అందరూ చూస్తుండగానే వీరిద్దరికి మూత్రం తాగించారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఇక బాధిత దంపతులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.