దేశం చూపు తెలంగాణ వైపు

Update: 2018-06-02 10:05 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్నామన్న ఆయన...40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందన్న ఆయన.... సంక్షేమ, అభివృద్ధి పథకాలకు తెలంగాణ రోల్‌ మోడల్‌గా మారిందని తెలిపారు. 

సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎన్నో అడ్డంకులను అధిగమించి....ఏ రాష్ట్రమూ అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేశామని స్పష్టం చేశారు. ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తున్నామన్న ఆయన...దశల వారీగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సంపద సృష్టించి..ప్రజలకు పంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు.

రైతులు పంటలు పెట్టుకోవడానికి...రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు సీఎం కేసీఆర్‌. రైతు బంధు పథకంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందన్న ఆయన...ఎల్‌ఐసీ ద్వారా రైతులకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతు బీమా ప్రీమియం డబ్బును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్‌ తెలిపారు. 

పెద్ద ఎత్తున గోదాములు నిర్మించామన్న సీఎం కేసీఆర్‌...సకాలంలో రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతులు కన్న కలలు నిజం చేస్తూ...వ్యవసాయ రంగంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా....ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే....కొత్త ప్రాజెక్టు పనులు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిచ్చిందన్న కేసీఆర్‌....రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

మిషన్ కాకతీయ పథకంతో లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు సీఎం కేసీఆర్‌.  పాలమూరు జిల్లాను పచ్చని పంటల జిల్లాగా మార్చేశామన్న ఆయన...కరవులో ఉన్న పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం చేశామన్నారు. భవిష్యత్‌లో రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగి...బంగారు తెలంగాణను ముద్దాడుతామని కేసీఆర్‌ అన్నారు. 

 

Similar News