ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటుపై వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్తో భేటీ అయిన చంద్రబాబు కొద్ది సేపటి క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. మోడీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఆయన రాహుల్తో చర్చలు జరుపుతున్నారు. అనంతరం ఆయన సీతారాం ఏచూరి, ములాయంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, తేజశ్వితో భేటీ అయ్యే అవకాశం కనిప్తోంది.
వారం వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీలో పర్యటించారు సీఎం చంద్రబాబు. గత నెల 27న ఢిల్లీలో పర్యటించి పలు పార్టీల నేతలను చంద్రబాబు కలిశారు. తాజాగా ఇవాళ సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడులు తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చించారు. ప్రజాస్వామ్యం, వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు చెప్పారు.
దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై తాము చర్చించుకున్నామని ఫరూక్ తెలిపారు. దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకొనిపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెప్పుకోలేదని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు ఢిల్లీ టూర్లో చంద్రబాబు ప్రాధాన్యమివ్వనున్నారు. ముఖ్యంగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్లకు.. కాంగ్రెస్ పార్టీకి మధ్య కొన్ని సమస్యలున్నాయి. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీకీ, వామపక్షాలకు మధ్య విభేదాలున్నాయి. మొదట కలసి వచ్చే పార్టీల నాయకులందరితోనూ సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత.. ఆయా పార్టీల మధ్య ఉన్న విబేధాలను చక్కదిద్దడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఆ తర్వాత, ఈడీ, ఆదాయ పన్నుశాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిరసనగా.. పలు పార్టీల ఎంపీలతో కలసి వెళ్లి ఆయా విభాగాల అధినేతలకు వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది.