పాము కాటుకు ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామానికి చెందిన నాగులుకు కుమారుడు, కుమార్తె. భార్యని వెంటబెట్టుకుని నాగులు బేల్దారి పనులకు వెళుతుండేవాడు. ఆదివారం పనుల నిమిత్తం నాగులు దంపతులు బయటికి వెళ్లారు. ఇంట్లో సోహెల్ అహ్మద్ (5) ఒక్కడే వున్నాడు. ఈ క్రమంలో త్రాచుపాము ఇంటిలోకి ప్రవేశించి సోహెల్ అహ్మద్ ను కాటేసింది. కాసేపటి తరువాత నాగులు దంపతులు ఇంటికి వచ్చారు. బాలుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ అప్పటికే సోహెల్ అహ్మద్ మృతిచెందాడు. ఆడుతూ పాడుతూ తిరిగిన తమ కుమారుడు ఇక లేడన్న వార్తను ఆ తలిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాలుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.