సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!
క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్కు నెటిజన్లు చుక్కలు చూపించారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ హీరోయిన్ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార.. తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్ కదమ్ ట్వీట్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. సొనాలి బింద్రేపై వచ్చిన మరణ వార్త రూమర్. అందులో వాస్తవం లేదు. గత రెండు రోజులుగా నేను బాధలో మునిగిపోయాను. చేసిన తప్పుకు చింతిస్తున్నాను. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని రామ్ కదమ్ ట్వీట్ చేశారు.
About Sonali Bendre ji It was rumour . Since last two days .. I pray to God for her good health & speedy recovery
— Ram Kadam (@ramkadam) September 7, 2018