తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో డాక్టర్లు ఆయనకు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వివేకానందరెడ్డిని పరామర్శించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్ ఆసుపత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్రావును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం భాస్కర్రావు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు.