అమృత్సర్లో జరిగిన రైలు ప్రమాదం ఒక కళాకారుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీరని శోకాన్ని మిగిల్చింది. రావణుడి వేషధారణలో ఉన్న దల్బీర్ సింగ్ 8 మందిని కాపాడి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇతరుల ప్రాణాలను కాపాడిని దల్బీర్ సింగ్ మృతి స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
అమృత్సర్కు చెందిన దల్బీర్ సింగ్ కూడా కొన్నేళ్లుగా రామ్లీలా నాటకంలో రావణుడి వేషం వేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతను అమృత్సర్లో జరిగిన రామ్లీలా నాటకంలో రావణుడి వేషం వేశాడు. అయితే జోడా పాటక్ వద్ద జరుగుతున్న రావణ దహన వేడుకను వీక్షిస్తున్న సమయంలో దల్బీర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. పట్టాలపై ఉన్న ప్రజలు కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా వేగంగా జలంధర్ అమృత్ సర్ రైలు వారిపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన దల్బీర్ సింగ్ వెంటనే పట్టాల దగ్గరకు పరుగులు తీసి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశాడు. 8 మంది ప్రాణాలను కాపాడాడు. చివరకు తన ప్రాణాలు కోల్పోయాడు.
పట్టాల పై ఉన్న వారిని కాపాడుతున్న క్రమంలో దల్బీర్ సింగ్ కాలు చిక్కుకుందని రైలు అతన్ని కూడా వేగంగా లాక్కెల్లడంతో మృతి చెందాడని అతని సోదరుడు బల్బీర్ సింగ్ తెలిపాడు. ఈ ఘటన పట్ల దల్బీర్ ఫ్యామిలీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంది. దల్బీర్కు 8 నెలల చిన్న బాబు ఉన్నాడు. కుటుంబానికి ఆధారం అయిన కుమారుడు మరణించడంతో.. తన కోడలికి ఉద్యోగం ఇప్పించాలని దల్బీర్ తల్లి పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
దల్బీర్ సింగ్ గత పదేళ్లలో రాముడు, లక్ష్మణుడు తదితర వేశాలు వేశాడు. తన ప్రాణాలను లెక్కచేయకుండా 8 మంది ప్రాణాలు కాపాడిన దల్బీర్ సింగ్ చనిపోవడంతో స్థానికులు తీవ్రంగా కలత చెందుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు తమతో ఉన్న దల్బీర్ ఇక లేడనే వార్త స్థానికులను కలచివేస్తోంది.