కోలీవుడ్ నటుడు, తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు విశాల్ శుక్రవారం చెన్నై హైకోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ బృందం గెలుపొందింది. ప్రముఖ నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టగానే నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాల్ ప్రకటించారు. దీనిపై రాధారవి చెన్నై హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ పూర్తయ్యే వరకు శరత్ కుమార్, రాధారవి తదితరులపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు గత సెప్టెంబర్ 22న విశాల్ తరఫు న్యాయవాదులు హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాధారవి తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ పత్రం సమర్పించారు. కానీ కొన్ని రోజుల తరువాత రాధారవితో పాటు మరికొందరని సంఘం నుంచి సస్పెండ్ చేసినట్లు విశాల్ వెల్లడించారు. దీంతో రాధారవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి ఎం.సుందరేశ్ నటుడు విశాల్ డిసెంబర్ 19లోపు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
ఆ మేరకు మంగళవారం హైకోర్టు విచారణకు విశాల్ హాజరు కాలేదు. విశాల్ అనారోగ్యంతో ఉండటం వల్ల హాజరుకాలేకపోయినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో ఈ నెల 22న విశాల్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ ప్రకారమే శుక్రవారం ఉదయం నటుడు విశాల్ హైకోర్టులో హాజరై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. నడిగర్ సంఘంలోని మెజారిటీ సభ్యుల సిఫార్సు మేరకే రాధారవి సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు వివరణ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి కేసు తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేశారు.