ఏసీబీకి మరో అవినీతి అనకొండ దొరికింది. లేబర్ కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎ. గాంధీ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ వారాసిగూడలోని నివాసంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లేబర్ కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎ.గాంధీని అదుపులోకి తీసుకున్న అధికారులు అక్రమాస్తులపై ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్తోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 3కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు hmtvతో తెలిపారు. ఒక బిల్డింగ్తోపాటు రెండు ఫ్లాట్స్, కొవ్వూరులో 18 ఎకరాల భూమి, 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయన్న ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ బ్యాంక్ లాకర్ను తెరవాల్సి ఉందన్నారు. సోదాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
1994లో జూనియర్ సివిల్ జడ్జిగా చేరిన గాంధీ న్యాయమూర్తిగా వివిధ కోర్టుల్లో బాధ్యతలు నిర్వహించారు. అయితే కొంతకాలంగా గాంధీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కానీ గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తుండటంతో హైకోర్టు అనుమతి తీసుకుని అతని నివాసాలపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్తోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకేసారి 7చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ టీమ్స్ ఇప్పటివరకు 3కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం వాటి వాల్యూ 6కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేయాల్సి ఉందని, దాన్ని ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందన్నారు.