కికీ ఛాలెంజ్ తీసుకున్న ముగ్గురు కుర్రాళ్లకు మహారాష్ట్ర పోలీసులు తిక్క కుదిర్చారు. ఈ ఛాలెంజ్ గురించి దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నా కుర్రకారు ఆగడం లేదు. ఛాలెంజ్ను స్వీకరించొద్దంటూ పోలీసులు ఎంతగా చెప్పుకొస్తున్నా యూత్ దాన్ని బుర్రకెక్కించుకోవడం లేదు. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కికీ ఛాలెంజ్ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫామ్ పైకి దూకి డ్యాన్సులు చేశారు. దీన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
దీంతో ఒళ్లు మండిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చారు. విచారించిన కోర్టు ముగ్గరికి విసాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫామ్ను వారానికి మూడు రోజుల పాటు శుభ్రం చేయాలని శిక్షించింది. అంతేకాకుండా శుభ్రం చేసే వీడియో ఫూటేజ్ను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఏదైనా శిక్ష వేసే విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.