ఇవాళ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తుది తీర్పు రాబోతోంది. డీఎంకే సీనియర్నేత, కేంద్ర మాజీ మంత్రి రాజా, రాజ్యసభ సభ్యురాలు , డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి ప్రధాన నిందితులుగా వున్న కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆందర్లోనూ ఆసక్తి ఏర్పడింది. నిందితులు రాజా, కనిమొళి ఇప్పటికే పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో రాబోయే తీర్పు తమకు వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభావం ఆర్కే నగర్ ఉపఎన్నికపై పడుతుందని డీఎంకే నేతలు తీవ్ర ఆందోళనలో వున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సంకీర్ణప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజా టెలికంశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన హయాంలో 2జీ స్పెక్ట్రం కేటాయించడంలో భారీ కుంభకోఫం జరిగిందని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తేల్చింది. ఈ అవినీతి కారణంగా ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు కాగ్ స్పష్టం చేసింది. పదేళ్ల క్రితం జరిగిన అవినీతిపై సీబీఐ రెండు కేసులు, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఒక కేసు నమోదు చేశాయి. 2జీ స్పెక్ట్రం హక్కులను 122 మందికి కేటాయించడంలో ప్రభుత్వానికి 30 వేల 984 కోట్ల ఆదాయానికి గండి పడిందని ఛార్జ్షీటులో నమోదు చేశారు. ఆరేళ్లుగా సాగిన విచారణ గత ఏప్రిల్ 26న ముగిసింది. కొద్దిసేపట్లో తీర్పురానుంది.