ట్రాక్టర్ ప్రమాద బాధితులకు మంత్రుల పరామర్శ

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, అదిమూలపు సురేష్ లు పరామర్శించారు. శుక్రవారం ఉదయం ఒంగోలు లోని సర్వ జన ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు చెందిన వారిని పరామర్శించారు.

అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వం నుంచి నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటన పై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. భాదితులు తమకు గ్రామంలో ఇంటి స్థలలు కావాలని కోరారని ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన 10 మంది మృత దేహాలకు ఒంగోలు రిమ్స్ లో ఈరోజు ఉదయం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Update: 2020-05-15 05:48 GMT

Linked news