Stock Market Today: స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు.. ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల జోరు కొనసాగింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కొత్త ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది.
Stock Market Today: స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు.. ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు సూచీలను ముందుకు నడిపింది. ఎఫ్ఎంసీజీ రంగం మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కొనసాగాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కొత్త ఆల్టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది.
సెన్సెక్స్ ఉదయం 85,259.36 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,812.27 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 573.41 పాయింట్ల లాభంతో 85,762.01 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 26,340.00 పాయింట్ల వద్ద కొత్త రికార్డు స్థాయిని తాకి, చివరికి 182 పాయింట్ల లాభంతో 26,328.55 వద్ద స్థిరపడింది.
విదేశీ మారక మార్కెట్లో రూపాయి డాలర్తో పోలిస్తే బలహీనపడి 90 మార్కును దాటి 90.20 వద్ద ట్రేడైంది. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల జాబితాలో నిలిచాయి. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 60.82 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,387 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.