ఆనం వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్.. విజయసాయిరెడ్డి వార్నింగ్..

వైసీపీ సీనియర్ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.

Update: 2019-12-07 09:36 GMT
విజయసాయిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి

వైసీపీ సీనియర్ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఎవరు గీత దాటిన సహించే ప్రసక్తే లేదని ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలను హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని అన్నారు.

శనివారం తాడేపల్లిలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. పార్టీలో సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకోవాలని.. అంతేకాని మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని వెల్లడించారు. గీత దాటితే పార్టీలో ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.

కాగా 'స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి వెళ్లాలి. ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లాలి. అక్కడ కబ్జా రాయుళ్లు, లిక్కర్‌ మాఫియా, బెట్టింగ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా.. ఇలా ఒక్కటేమిటి ఏ రకం మాఫియా కావాలన్నా ఉన్నాయి. వేలాది కుటుంబాలు, లక్షలాది మంది ప్రజలు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు. మాఫియా ఆగడాలను అడ్డుకునే సమర్థుడైన పోలీసు అధికారి రావాలి.

ప్రజలకు భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించాలని నేను కోరుకుంటున్నా' అంటూ ఆనం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. త్వరలో ఆనం రామనారాయణరెడ్డి కూడా సీఎం జగన్ ను కలిసి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. 


Tags:    

Similar News