గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్కు చికిత్స అందించారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద హైవే సర్వీస్ రోడ్డులో కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటో డ్రైవర్ అయ్యప్ప స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో తాడేపల్లి నుంచి తాడికొండ వెళ్తున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఘటనను గమనించారు.
వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన ఆటో డ్రైవర్ కు సుమారు 20 నిమిషాలపాటు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో ఎక్కించి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఆ తరువాత తాడేపల్లి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని తెలియజేసి అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.