కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయనుంది. అవసరమైతే చట్టసవరణ చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. వ్యవసాయ మిషన్ అధికారులతో సీఎం జగన్ శనివారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయని, రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేస్తాం. ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మిషన్ పరిథిలోనే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడి రాయితీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పగలు 9 గంటలు నిరంతరాయ విద్యుత్ కోసం 60 శాతం ఫీడర్లను ఆధునీకరిస్తామని, దీనికోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తామని నాగిరెడ్డి చెప్పారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తాం. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉందని నాగిరెడ్డి చెప్పారు.