తెలుగుదేశం పార్టీతో అంటకాగడం వల్లే పవన్ కళ్యాణ్ ఒక నటుడిస్థాయి నుంచి రాజకీయ నేత స్థాయికి ఎదగలేకపోయారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ తన పార్టీ తరుపున నిర్దిష్టమైన ఎజెండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరి పార్టీ ప్రయోజనాల కోసమో పోరాటాలు చెయ్యాల్సిన పనిలేదని అన్నారు. జగన్ విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరాలకు ఉపయోగపడే స్టేజ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన వ్యవహారశైలిలో పరిణతి కనిపించడం లేదన్నారు. దీన్ని బట్టే పవన్ అజెండా ఏమిటో ఏ జెండా నీడలో ఉన్నాడో జనానికి అర్థమైపోయిందన్నారు కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా కళ్లు తెరిచి సొంత విధానాన్ని ఏర్పర్చుకోవాలని హితవు పలికారు. ఇసుక కొరత ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో లేదన్న కృష్ణమూర్తి.. వరదలు తగ్గాక సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని చెప్పారు.