ఈ తీర్పు పుల్లారావుకు చెంపపెట్టు: ఎమ్మెల్యే రజిని
యడవల్లి సొసైటీ రద్దును వ్యతిరేకిస్తూ రివిజన్ అథారిటీ ఇచ్చిన తీర్పు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెంపపెట్టు లాంటిదని శాసన సభ్యురాలు విడదల రజిని అన్నారు.
చిలకలూరిపేట: యడవల్లి సొసైటీ రద్దును వ్యతిరేకిస్తూ రివిజన్ అథారిటీ ఇచ్చిన తీర్పు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెంపపెట్టు లాంటిదని శాసన సభ్యురాలు విడదల రజిని అన్నారు. స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదంటూ గత ప్రభుత్వంలో ఈ సొసైటీ ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని గురువారం రివిజన్ అథారిటీ తీర్పు ఇచ్చిందని, ఇది రైతులు సాధించిన విజయమని తెలిపారు.''యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్'' పేరుతో అప్పట్లో దళితులు ఒక సొసైటీగా ఏర్పడగా ఏక పట్టాగా దళితులకు భూములు అందజేశారన్నారు.
టీడీపీ అధికారంలో ఉండగా ఈ భూములు కాజేయాలని చూశాడని చెప్పారు. ఈ భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉండటమే దీనికి కారణమన్నార. ఈ నివేదికలను అడ్డం పెట్టుకుని అప్పటి ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసిందన్నారు. ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించిందని, 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా దుర్మార్గంగా, ఏ మాత్రం కనికరం లేకుండా రద్దు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో యడవల్లి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.