పవన్ క్లారిటీ ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

మదనపల్లె జనసేన సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన నాయకుడు సాకే పవన్ కుమార్ వైసీపీ నేతలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2019-12-06 06:32 GMT
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పవన్ కళ్యాణ్

మదనపల్లె జనసేన సమావేశంలో అనంతపురం జిల్లా జనసేన నాయకుడు సాకే పవన్ కుమార్ వైసీపీ నేతలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ అధినేత పవన్ కల్యాణ్ సై అంటే వైసీపీ వారి తలలు నరుకుతానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా నరికేస్తానంటూ పవన్ ఎదుటే వ్యాఖ్యలు చేశాడు. అయితే పవన్ అతని వ్యాఖ్యలపై మందలించలేదు. దీంతో వైసీపీ నేతలు పవన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

మరోవైపు ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో వివిధ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి... ఎస్పీని కలిసి అతనిపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి స్పందించారు.

అసలు సాకే పవన్ కుమార్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని అన్నారు. స్థాయికి తగ్గ వాళ్లకి పవన్ మైకులు ఇచ్చి మాట్లాడిస్తే మేలని సూచించారు. అతన్ని టీడీపీ వాళ్ళే పోటీ చేయించారని.. అతనికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ కులాల రాజకీయానికి దిగారని అన్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేళాపన చేయిస్తే..ప్రజలే బుద్ది చెబుతారని, తన పేరు వాడితే మైలేజ్ వస్తుందనే ఇలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ప్రకాష్ రెడ్డి.


Tags:    

Similar News